శాన్ ఫ్రాన్సిస్కో (అమెరికా): అమరావతిని జ్ఞాన, సృజనాత్మకత, డిజిటల్ అవకాశాల కేంద్రంగా తీర్చిదిద్దే యత్నాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేగం పెంచింది. ఈ దిశగా రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ మంత్రి నారా లోకేష్, ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన డిజైన్ ప్లాట్ఫార్మ్ కాన్వా ఉన్నతాధికారులతో శాన్ ఫ్రాన్సిస్కోలో సమావేశమయ్యారు. కాన్వా చీఫ్ కస్టమర్ సక్సెస్ ఆఫీసర్ రోబ్ గిగిలియో, ఎడ్యుకేషన్ & పబ్లిక్ సెక్టార్ హెడ్ జాసన్ విల్మాట్లతో లోకేష్ విస్తృతంగా చర్చలు జరిపారు.
లోకేష్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, రూ.65 వేల కోట్ల వ్యయంతో అమరావతి రాజధాని నిర్మాణం అంతర్జాతీయ ప్రమాణాలతో వేగంగా జరుగుతోందని చెప్పారు. ఇందులో భాగంగా రూపుదిద్దుకుంటున్న ఎంటర్టైన్మెంట్ సిటీ, అమరావతి క్రియేటర్ ల్యాండ్ ప్రాజెక్టులలో యువతకు శిక్షణ, సృజనాత్మక నైపుణ్యాలు అందించేందుకు కాన్వా, Creative Land Asia వంటి సంస్థలు భాగస్వామ్యం చేస్తే గొప్ప ప్రయోజనం ఉంటుందని సూచించారు. రాష్ట్ర యువతను డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో ప్రపంచ స్థాయికి తీసుకెళ్లడమే తమ లక్ష్యమని లోకేష్ స్పష్టం చేశారు.
కాన్వా సిసిఎస్ఓ రోబ్ గిగిలియో మాట్లాడుతూ, సిడ్నీ ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న తమ సంస్థ ప్రపంచవ్యాప్తంగా 190 దేశాల్లో సేవలు అందిస్తున్నదని తెలిపారు. బీజింగ్, మనీలా, ఆస్టిన్ వంటి నగరాల్లో కార్యాలయాలు ఉండటంతో పాటు, విస్తృతమైన గ్లోబల్ రిమోట్ వర్క్ ఫోర్స్తో పనిచేస్తున్నామని చెప్పారు. ప్రెజెంటేషన్లు, సోషల్ మీడియా గ్రాఫిక్స్, డాక్యుమెంట్లు, పోస్టర్లు, వీడియోల రూపకల్పనను అత్యంత సులభతరం చేసే క్లౌడ్ ఆధారిత డిజైన్ టూల్స్ను కాన్వా అందిస్తున్నదని వివరించారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతిపాదనలను తమ సంస్థ సీనియర్ ఎగ్జిక్యూటివ్లతో పరిశీలించి, తగిన నిర్ణయం త్వరలో వెల్లడిస్తామని గిగిలియో హామీ ఇచ్చారు. ప్రస్తుతం కాన్వా మార్కెట్ క్యాపిటలైజేషన్ $40 బిలియన్లు కాగా, గత ఆర్థిక సంవత్సరం $2.5 బిలియన్ల ఆదాయం నమోదు చేసిన విషయం వెల్లడించారు.
