వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో తెరపైకొచ్చింది ఆరోగ్యశ్రీ పథకం.! పేదవాడికీ, అత్యాధునిక వైద్యం అందించాలన్న సదుద్దేశ్యంతో ఈ పథకానికి శ్రీకారం చుట్టి వుండొచ్చు. కానీ, ప్రజారోగ్యం కోసం ప్రభుత్వాలు వేల కోట్లు ఖర్చు చేస్తున్నాయి కదా.? అలాంటప్పుడు, కొత్తగా ప్రైవేటు ఆసుపత్రులు బాగుపడేందుకోసం ఈ ఆరోగ్యశ్రీ ఎందుకు.?
నిజమే, పేదవాడికి కూడా అత్యాధునిక వైద్య సౌకర్యాలు అందుబాటులో వుండాలి. అది, ప్రభుత్వాసుపత్రుల్లో అందినప్పుడే పేదలకు ప్రయోజనం. ప్రైవేటు ఆసుపత్రుల్లో పేదల్ని ఎలా చూస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
చిన్న చిన్న అనారోగ్య సమస్యలకీ సర్జరీల వరకూ తీసుకెళ్తాయి చాలా ప్రైవేటు ఆసుపత్రులు. ఆరోగ్యశ్రీ ముసుగులో ప్రైవేటు దోపిడీ గురించి ఉమ్మడి తెలుగు రాష్ట్రంలోనూ చాలా చర్చ జరిగింది. రాజకీయ నాయకుల కనుసన్నల్లో నడుస్తున్న ప్రైవేటు ఆసుపత్రులైతే, ఆరోగ్యశ్రీ కారణంగా చాలా బాగుపడ్డాయ్.
ఆరోగ్యశ్రీ పథకం కింద జరిగిన చాలా శస్త్ర చికిత్సలు, ప్రజారోగ్యాన్ని దెబ్బ తీశాయన్నది నిర్వివాదాంశం. ‘ఆరోగ్యశ్రీ వర్తించాలంటే, సర్జరీ తప్పనిసరి’ అనే ‘తప్పనిసరి సూచన’ ప్రైవేటు ఆసుపత్రుల నుంచి చాలామంది రోగులకు, వారి కుటుంబ సభ్యులకు ఎదురవుతోందన్నది కాదనలేని వాస్తవం.
ప్రతి యేటా వందల కోట్లు, వేల కోట్లు.. ఆరోగ్యశ్రీ పథకం కింద, ప్రైవేటు ఆసుపత్రులకు వెళుతున్నాయ్. మరి, ఇన్ని వందల వేల కోట్లతో ఎన్ని ఆసుపత్రుల్ని కొత్తగా నిర్మించొచ్చు.? ప్చ్.. ఆ దిశగా ప్రభుత్వాలు ఆలోచనే చేయడంలేదు.
వేల కోట్ల రూపాయల ప్రజాధనం ఆరోగ్యశ్రీ వల్ల వృధా అవుతోంటే, అవన్నీ మింగేస్తున్న ప్రైవేటు ఆసుపత్రులు తిరిగి అప్పుడప్పుడూ ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేస్తుండడం ఆశ్చర్యకరం. నెట్వర్క్ ఆసుపత్రులు సూది, సిరెంజిలకు కూడా డబ్బుల్లేక విలవిల్లాడుతున్నాయంటూ తాజాగా, ప్రభుత్వానికి నెట్వర్క్ ఆసుపత్రులు లేఖాస్త్రం సంధించాయ్. మరి, వేల కోట్లు ఏమైపోతున్నట్టు.?
ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా.. ఆరోగ్యశ్రీ అంటే, ప్రజారోగ్యానికి అనారోగ్యశ్రీ అనే అర్థం. ఇందులో ఇంకో మాటకు తావు లేదు. ప్రభుత్వాన్ని శాసించే స్థాయికి ప్రైవేటు ఆసుపత్రులు ఎదిగాయంటే, ఆ పాపం ఆరోగ్యశ్రీ పథకాన్ని కొనసాగిస్తున్న పాలకులదే.
ప్రభుత్వాసుపత్రుల్లో జెనెరిక్ మందులకు అధిక ప్రాధాన్యతనిస్తుంటారు. అదే ప్రైవేటు ఆసుపత్రులైతే అత్యంత ఖరీదైన మందుల వైపే మొగ్గు చూపుతారు. ఇవన్నీ ప్రభుత్వానికి తెలియనివేమీ కావు. కానీ, ప్రభుత్వాసుపత్రులపై పాలకులకు మమకారం వుండటంలేదు.
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి. ఆరోగ్యశ్రీ అనే అనారోగ్యానికి సరైన మందు కనిపెట్టి, ప్రజారోగ్యానికి సరైన చికిత్సని ప్రభుత్వాలు చేయలేకపోతే.. నష్టం అంచనాలకు అందదు.!
