BJP: రాజకీయ పార్టీలకు సోషల్ మీడియా వరం.! అదే సమయంలో శాపం కూడా.! ఔను, జనంలోకి చొచ్చుకు పోయేందుకు సోషల్ మీడియా కూడా రాజకీయ పార్టీలకు ఎంతో ఉపయోగపడుతోంది. మరీ ముఖ్యంగా యువతతో కనెక్ట్ అవడానికి సోషల్ మీడియా సరైన వేదిక అన్న భావనలో రాజకీయ పార్టీలున్నాయి.
దేశ రాజకీయాల్లో సోషల్ మీడియాని అత్యంత సమర్థవంతంగా వినియోగించుకుంటూ వచ్చింది భారతీయ జనతా పార్టీ మాత్రమే. ఆ సోషల్ మీడియా పాత్ర కూడా బీజేపీ విజయాల్లో ఎంతైనా వుంది. కానీ, ఇప్పుడు సీన్ మారింది. బీజేపీ ఇటీవల వరుస పరాజయాల్ని ఎదుర్కొనడానికీ ఇదే సోషల్ మీడియా కారణమవుతోంది.
దేశంలో ఎక్కడ ఏ చిన్న ఘటన జరిగినా, దానికి రాజకీయాలతో ముడిపెడుతూ వస్తున్నారు బీజేపీ సోషల్ మీడియా మద్దతుదారులు. మొన్నటికి మొన్న ఒరిస్సాలో రైలు ప్రమాదం జరిగితే, దానికీ ‘మతాన్ని’ ముడిపెట్టారు.. చెత్త రాజకీయాలు చేశారు.
కర్నాటక ఎన్నికల సమయంలో బీజేపీ సోషల్ మీడియా టీమ్ ఎత్తుగడలు విఫలమయ్యాయి. యువత బీజేపీకి దూరమవడానికి.. అలాగే ప్రత్యేకించి కొన్ని వర్గాలు బీజేపీ వినాశనాన్ని కోరుకున్నాయంటే దానికి బీజేపీ సోషల్ మీడియా విభాగం తాలూకు అతి కారణం.
ఇక, ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోనూ బీజేపీ ఖేల్ ఖతం చేయడానికి ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం ప్రయత్నిస్తున్నట్లుగా వుంది. టీడీపీ, జనసేనతో బీజేపీ పొత్త దిశగా సానుకూల పరిణామాలు కనిపిస్తున్న వేళ, బీజేపీ సోషల్ మీడియా మద్దతుదారులు.. దాన్ని చెడగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.
సోషల్ మీడియాలో చెత్త వల్ల రాజకీయ పార్టీల ఆలోచనలు మారవు. కానీ, పొత్తుల నేపథ్యంలో కింది స్థాయిలో కనిపించాల్సిన ఐక్యతను ఈ సోషల్ మీడియా చెత్త ఖచ్చితంగా చెడగొడుతుంది. మేధావుల ముసుగులో కొందరు బీజేపీ వాదుల వల్లనే ఇదంతా జరుగుతోంది.