వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అవుతూనే, పెద్దయెత్తున సలహాదారుల నియామకాన్ని చేపట్టారు. అనేక విభాగాల్లో ఈ సలహాదారులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డికి తగిన సలహాలు ఇవ్వాల్సి వుంది. ఆయా రంగాలకు చెందిన కొందర్ని వైఎస్ జగన్ ఎంపిక చేసుకుని మరీ తనకు సలహాదారులుగా నియమించుకున్న విషయం విదితమే. ఈ నియామకాలు ఇంకా కొనసాగుతూనే వున్నాయి.
అన్నట్టు, సలహాదారులకు ఇచ్చే గౌరవ వేతనాలు కూడా భారీగానే వుంటున్నాయి. చంద్రబాబు హయాంలోనూ ఈ సలహాదారుల వ్యవస్థ వుందండోయ్. అప్పుడు ఆయన్ని విమర్శించిన జగన్, ఇప్పుడు అదే బాటలో నడుస్తున్నారనుకోండి.. అది వేరే విషయం.
మరోపక్క, మీడియాలోనూ కొందర్ని తనకు అనుకూలంగా వైఎస్ జగన్ మార్చుకున్నారన్నది ఓపెన్ సీక్రెట్. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియానే కాదు, వెబ్ మీడియాలోనూ కొంత భాగం ఆయనకు అనుకూలంగా పనిచేస్తోంది. మరి, ఇంత సరంజామా వున్నప్పుడు, ప్రభుత్వానికి తలనొప్పులు వస్తే ఎలా.?
ముఖ్యమంత్రి అయ్యాక గడచిన పదకొండు నెలల సమయంలో దాదాపు 50 సార్లకు పైగా న్యాయస్థానాల్లో మొట్టికాయలు పడ్డాయి వైఎస్ జగన్ సర్కార్కి. ఇది చిన్న విషయమేమీ కాదు. ఇంతకు ముందెన్నడూ ఏ ప్రభుత్వానికీ ఈ స్థాయిలో మొట్టికాయలు పడలేదు. అంటే, అక్కడ సలహదారుల వ్యవస్థ సరిగ్గా పనిచేయడంలేదన్నమాట. సహచర మంత్రులు కూడా, ఆయా విషయాల్లో ముఖ్యమంత్రికి ‘సరైన డైరెక్షన్స్’ ఇవ్వలేకపోతున్నారన్నమాట.
రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా పనిచేసిన నిమ్మగడ్డ రమేష్కుమార్ విషయంలో ఏం జరిగిందో చూశాం. ‘ప్రభుత్వం పరువు పోతుందా.?’ అన్న ముందస్తు చూపు ఒక్కరంటే ఒక్కరికి కూడా లేకుండా పోయింది. పైగా, ‘బొచ్చు పీకుతాడా.?’ అంటూ ఓ మంత్రిగారు బూతు పురాణం అందుకోవడం. జగన్ని మెప్పించేందుకు మంత్రులు కావొచ్చు, ఇతర ముఖ్య నేతలు కావొచ్చు ఈ తరహా ‘ఓవరాక్షన్’ చేయడం సహజమే.
కానీ, ఇక్కడే ముఖ్యమంత్రి.. ఆయన సలహాదారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. ఇంగ్లీషు మీడియం విషయంలో కూడా వాస్తవ పరిస్థితిని ముఖ్యమంత్రికి ఎవరూ ముందస్తుగా అర్థమయ్యేటట్లుగా చెప్పినట్లు లేదు. దాంతో, మొట్టికాయ తప్పలేదు. వైసీపీ జెండా రంగుల విషయంలో కావొచ్చు, ఇతరత్రా విషయాల్లో కావొచ్చు.. అన్నిటిలోనూ ఇదే పరిస్థితి.
భజన మీడియాని, తన చుట్టూ వున్న భజన బ్యాచ్ని నమ్ముకుంటే.. రానున్న నాలుగేళ్ళలో ఇంతకంటే పెద్ద ఎదురు దెబ్బల్ని వైఎస్ జగన్ ఎదుర్కోవాల్సి వస్తుంది. కష్టమైనా, నిజాల్ని తెలుసుకోవాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి మీద వుంటుంది. లేకపోతే, ప్రతిసారీ మొట్టికాయలేయుంచుకుంటున్న వ్యక్తి నాయకుడెలా అవుతాడు.? పరిపాలనకు ఎలా అర్హుడవుతాడు.? అన్న చర్చ ప్రజల్లో షురూ అవుతుంది. అది రాజకీయంగా వైఎస్ జగన్ మోహన్రెడ్డికి అస్సలేమాత్రం మంచిదికాదు.
భజన ముసుగులో కొందరు ‘వెన్నుపోటు’కి పాల్పడుతున్నారన్న విషయాన్ని వైఎస్ జగన్ ఎప్పుడు గుర్తిస్తారో ఏమో.! గ్రౌండ్ లెవల్లో ఏం జరుగుతుందో గుర్తించక, భజనపరుల్ని ప్రోత్సహించిన చంద్రబాబుకి ఏ గతి పట్టిందో వైఎస్ జగన్ ఇప్పటికైనా గుర్తెరగాలి.
539544 837970excellent points altogether, you simply gained a logo new reader. 992092