హైదరాబాద్లో శాస్త్రీయ నృత్య కళా వైభవానికి ప్రతీకగా నిలిచిన ‘భావ రస నాట్యోత్సవం’ మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘మదాలస – స్పేస్ ఫర్ డివైన్ ఆర్ట్’ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 28, 2026న సాయంత్రం 6:30 గంటలకు లక్డీకాపూల్లోని రవీంద్ర భారతి వేదికగా ‘భావ రస నాట్యోత్సవం – సీజన్ 2’ ఘనంగా నిర్వహించనున్నారు.
ఈ ఏడాది జనవరి 4న హైదరాబాద్లోని ఫీనిక్స్ అరేనాలో జరిగిన సీజన్ 1 కార్యక్రమం విశేష స్పందనను అందుకుంది. ప్రముఖ నృత్య కళాకారులు సౌజన్య శ్రీనివాస్, మంజు వి. నాయర్, స్వప్న రాజేంద్రకుమార్ తమ అద్భుత ప్రదర్శనలతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు. ఆ విజయోత్సాహంతోనే ఇప్పుడు రెండో సీజన్కు మరింత వైభవంగా ఏర్పాట్లు చేస్తున్నారు.
సీజన్ 2లో భరతనాట్యం, కూచిపూడి నృత్యాల ప్రత్యేక ప్రదర్శనలు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. కళారత్న సౌజన్య శ్రీనివాస్ భరతనాట్యం, కూచిపూడి ప్రదర్శనలతో మెప్పించనున్నారు. ప్రమోద్ రెడ్డి మరియు అభినేత్రి ఎన్సెంబుల్ భరతనాట్యాన్ని ఆవిష్కరించనుండగా, ఎం. సురేంద్ర నాథ్ (ఎస్ఎన్ఏ యువ పురస్కార్ గ్రహీత) మరియు డా. బిజినా సురేంద్ర నాథ్ కూచిపూడి ప్రదర్శనతో ప్రేక్షకులను అలరించనున్నారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా దక్షిణ మధ్య రైల్వే చీఫ్ కమర్షియల్ మేనేజర్ రవి పాడి, భాషా మరియు సాంస్కృతిక శాఖ డైరెక్టర్ అనుగు నర్సింహా రెడ్డి, వీర్నాల ఫౌండేషన్ చైర్మన్ వీర్నాల బాలాజీ హాజరుకానున్నారు. ప్రముఖ తెలుగు యాంకర్ మరియు సాంస్కృతిక వ్యాఖ్యాత అంబడిపూడి మురళీకృష్ణ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నారు.
శాస్త్రీయ కళల ప్రాచుర్యానికి, సంప్రదాయ నృత్యాలకు మరింత ప్రోత్సాహం కల్పించడమే లక్ష్యంగా ఈ నాట్యోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. హైదరాబాద్లోని సాంస్కృతిక వేదిక రవీంద్ర భారతి మరోసారి నృత్య రసికులతో కళకళలాడనుంది. శాస్త్రీయ సంగీతం, నాట్యం, భావ వ్యక్తీకరణల సమ్మేళనంగా ఈ కార్యక్రమం కళాభిమానులకు ఒక విశిష్ట అనుభూతిని అందించనుంది.
