తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారం నేపథ్యంలో రాజకీయంగా చర్చనీయాంశంగా మారిన ఈ అంశంపై మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ట్వీట్ ద్వారా స్పందించారు. ఏడుకొండల వాడి సాక్షిగా చెబుతున్నానని, వేంకటేశ్వర స్వామిపై తనకు ఉన్న అపార భక్తి కారణంగా తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారం తన మనసును తీవ్రంగా గాయపరిచిందని పేర్కొన్నారు.
తన ట్వీట్లో అచ్చెన్నాయుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేవలం NDDB నివేదికలో వెల్లడైన విషయాలనే సభ ముందు ఉంచారని తెలిపారు. అయితే చేసిన తప్పులు బయటపడతాయనే భయంతో వైసీపీ నేతలు చర్చను దారి మళ్లించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ప్రజలు విమర్శిస్తారనే ఆందోళనతో కావాలనే హెరిటేజ్ అంశాన్ని ముందుకు తెచ్చి రాజకీయ డ్రామాలు చేస్తున్నారని విమర్శించారు.
అన్యమతస్థుడైన వైఎస్ జగన్ రెడ్డికి హిందూ ధర్మం, వేంకటేశ్వర స్వామిపై గౌరవం లేదని తాను చేసిన వ్యాఖ్యలకు ఇప్పటికీ కట్టుబడి ఉన్నానని అచ్చెన్నాయుడు ట్వీట్లో స్పష్టం చేశారు. ఈ విషయంపై తన వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని కూడా పేర్కొన్నారు.
కోట్లాది మంది హిందువుల మనోభావాలను, భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీసినందుకు వైసీపీ నేతలు ప్రజలకు క్షమాపణ చెప్పాలని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు. మండలి చైర్మన్ ఇచ్చిన వివరణను గౌరవిస్తూ తన మాటలను వెనక్కి తీసుకున్నప్పటికీ, సభను అడ్డుకుంటూ వైసీపీ నేతలు రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు.
తిరుమల వంటి పవిత్ర స్థలానికి సంబంధించిన అంశాల్లో రాజకీయాలు చేయడం తగదని అచ్చెన్నాయుడు ట్వీట్లో పేర్కొన్నారు. కలియుగ దైవమైన వేంకటేశ్వర స్వామిపై భక్తుల విశ్వాసంతో ఆటలాడిన వారిని వదిలే ప్రసక్తే లేదని తెలిపారు. ధర్మం పక్షాన నిలబడి ఎన్ని రోజులైనా, ఏ వేదికపై అయినా చర్చకు సిద్ధంగా ఉన్నామని కూడా వెల్లడించారు.
వెంకన్న సాక్షిగా.. పాపం పండింది!
వందల ఏళ్ల చరిత్ర ఉన్న బ్రిటీష్ వాళ్లు కూడా తిరుమల పవిత్రతను కాపాడారు తప్ప, ఆ జోలికి వెళ్లలేదు. కానీ గడిచిన ఐదేళ్లలో @ysjagan రెడ్డి మాత్రం కేవలం తన స్వార్థం కోసం, పగతో ఆ వేంకటేశ్వర స్వామిని అపవిత్రం చేసే దారుణమైన కార్యక్రమాలకు ఒడిగట్టారు.… pic.twitter.com/sDvEitAxsC
— Kinjarapu Atchannaidu (@katchannaidu) March 5, 2026
