ఉపాసన కొణిదెల అంటే తెలుసు కదా.? పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా. ఔను, పిఠాపురం ఎమ్మెల్యే, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోదరుడు మెగాస్టార్ చిరంజీవికి కోడలు ఉపాసన. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి అయిన ఉపాసణ, పిఠాపురంలో అపోలో ఆసుపత్రి తరఫున అత్యంత ప్రత్యేకమైన ‘మిషన్’ ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు.
మాతా శిశు సంరక్షణకి కట్టుబడి, ‘మెటర్నీ, ఇన్ఫాంట్ దశలో మరణాల్ని సున్నా స్థాయికి తగ్గించడం’ సహా, జననం తర్వాత పూర్తి స్థాయిలో ఆరోగ్యకరమైన ఆహారం, పరిశుభ్రత తదితర అంశాలకు సంబంధించి అవగాహనా కార్యక్రమాల్ని పిఠాపురంలో చేపట్టనుంది అపోలో ఆసుపత్రి. తన తాతయ్య పద్మ విభూషణ్ ప్రతాప్ రెడ్డి 93వ జన్మదినం సందర్భంగా ఈ వివరాల్ని ఉపాసన వెల్లడించారు.
విమెన్ ఎంపవర్మెంట్, స్కిల్ బిల్డింగ్ వంటి అంశాల్లో పిఠాపురం నియోజకవర్గాన్ని ఓ యూనిట్గా తీసుకుని, పలు కార్యక్రమాలు చేపట్టనున్నారు ఉపాసన. మహిళలకు ఆర్థిక స్వాతంత్ర్యం, స్వేచ్ఛ అలాగే కమ్యూనిటీ బలోపేతం, వందకి పైగా అంగన్వాడీ కేంద్రాలను మరింత మెరుగ్గా తీర్చిదిద్దడం తదితర లక్ష్యాలతో బృహత్ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు ఉపాసన ప్రకటించారు.
ఉపాసన ప్రకటించిన ఈ మిషన్ పట్ల హర్షం వ్యక్తం చేసింది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కార్యాలయం. పిఠాపురంలో చేపట్టనున్న ఈ కార్యక్రమాలతో నియోజకవర్గ రూపు రేఖలు వైద్య, ఆరోగ్యం పరంగా మారతాయని ప్రభుత్వం భావిస్తోంది.
అపోలో గ్రూప్ తరఫున పిఠాపురం నియోజకవర్గంలో ఇంత పెద్ద మిషన్ ప్రారంభం కానుండడం పట్ల నియోజకవర్గ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గంలో అపోలో ఆసుపత్రి నిర్మాణం కోసం స్థల సేకరణ జరుగుతున్నట్లు గతంలోనే ప్రచారం జరిగింది. కేవలం పట్టణాలకు మాత్రమే పరిమితమయ్యే అత్యాధునిక వైద్యం, పిఠాపురం లాంటి నియోజకవర్గంలో అందుబాటులోకి రానుండడం అభినందించదగ్గ విషయమే.
అంగన్వాడీలను అభివృద్ధి చేయడం, విమెన్ ఎంపవర్మెంట్, మహిళలకు ఆర్థిక స్వాతంత్ర్యం.. ఇవన్నీ సమాజాభివృద్ధికి సూచికలుగా చెప్పుకోవచ్చు. పిఠాపురం ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాక, క్షణం తీరిక లేకుండా అభివృద్ధి కోసం శ్రమిస్తున్న పవన్ కళ్యాణ్, దేశంలోనే పిఠాపురం నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దడంలో తనదైన ప్రత్యేకతను చాటి చెబుతున్నారు.
కుటుంబం పరంగా, మెగా కాంపౌండ్ నుంచి పిఠాపురం నియోజకవర్గానికి దక్కుతున్న ఈ అండదండలు.. మరింత ప్రత్యేకం.


