అమరావతిని అంతర్జాతీయ టెక్నాలజీ కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అమెరికా పర్యటనను కొనసాగిస్తున్నారు. శాన్ఫ్రాన్సిస్కోలో రిగెట్టి కంప్యూటింగ్ సిటిఓ డేవిడ్ రివాస్ను ఆయన కలిసి ఆంధ్రప్రదేశ్ డిజిటల్ మార్పు ప్రణాళికపై చర్చించారు. ఈ సందర్భంగా అమరావతిలో త్వరలో ప్రారంభం కానున్న క్వాంటమ్ వ్యాలీలో ప్రత్యేక క్వాంటమ్ కంప్యూటింగ్ రీసెర్చ్ వింగ్ను స్థాపించాలని లోకేష్ కోరారు. క్వాంటమ్ క్లౌడ్ టెక్నాలజీని ఏపీ డిజిటల్ మౌలిక సదుపాయాల్లో అనుసంధానించి రాష్ట్రాన్ని దేశంలోనే తొలి క్వాంటమ్ రెడీ స్టేట్గా మార్చాలనే ప్రభుత్వం లక్ష్యాన్ని ఆయన వివరించారు.
ఎఆర్/వీఆర్ కంటెంట్ క్రియేషన్, ఏఐ ఆధారిత మీడియా ప్రాసెసింగ్ కోసం క్రియేటర్ ల్యాండ్ కార్యక్రమానికి రిగెట్టి సహకరించాల్సిన అవసరాన్ని కూడా లోకేష్ గుర్తుచేశారు. భారతదేశం మరియు గ్లోబల్ సౌత్ మార్కెట్లకు ఆంధ్రప్రదేశ్ను ఆధారంగా తీసుకుని క్వాంటమ్-యాజ్-ఏ-సర్వీస్ (QaaS) అందించే అవకాశాలు విస్తారంగా ఉన్నాయని ఆయన సూచించారు.
ఈ ప్రతిపాదనలపై స్పందించిన రిగెట్టి సిటిఓ డేవిడ్ రివాస్… బర్క్లీ కేంద్రంగా పనిచేస్తున్న తమ సంస్థ ఫ్రీమాంట్లో అత్యాధునిక క్వాంటమ్ హార్డ్వేర్ తయారీ, ఆర్అండ్డీ కేంద్రాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా రీసెర్చ్ ఇనిస్టిట్యూషన్స్, ప్రభుత్వ సంస్థలు, ప్రముఖ భాగస్వామ్య సంస్థలతో కలిసి క్వాంటమ్ సేవలు అందిస్తున్నామని చెప్పారు. ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలను పరిశీలించి తగిన విధంగా ముందుకు సాగుతామని రివాస్ వెల్లడించారు.
