AP Liquor scam: రాష్ట్రంలో సంచలనం రేకెత్తిస్తున్న ఏపీ లిక్కర్ స్కామ్లో మరో కీలక పరిణామం జరిగింది. కేసులో నిందితుడిగా ఉన్న బాలాజీ గోవిందప్పను సిట్ అధికారులు మైసూరులో అరెస్టు చేశారు. ప్రస్తుతం ఆయన్ను విజయవాడకు తీసుకొస్తున్నారు. గోవిందప్ప భారతీ సిమెంట్స్ డైరెక్టర్ కావడం కేసులో మరింత ఆసక్తి రేకెత్తిస్తోంది.
లిక్కర్ స్కామ్ కేసు విచారణలో భాగంగా ఇప్పటికే గోవిందప్పతోపాటు సీఎంఓ మాజీ కార్యదర్శి ధనుంజయ రెడ్డి, నాటి సీఎం జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డికి 3 రోజుల క్రితం సిట్ అధికారులు నోటీసులు ఇచ్చి విజయవాడ కమిషనరేట్లోని సిట్ కార్యాలయంలో ఆదివారం ఉదయం 10 గంటలకు విచారణకు హాజరుకావాలని సూచించారు. అయితే వీరంతా నోటీసులను బేఖాతరు చేసి విచారణకు హాజరు కాలేదు. వీరి ముందస్తు బెయిల్ పిటిషన్ను హైకోర్టు కొట్టివేయడం ఇక్కడ గమనార్హం. సుప్రీంకోర్టులో కూడా వీరికి ఊరట దక్కలేదు.
ఇంత జరిగినా వీరు విచారణకు హాజరు కాకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. లిక్కర్ సరఫరా కంపెనీలు, డిస్టిలరీల నుంచి ముడుపులు వసూలు చేయడం, వాటిని డొల్ల కంపెనీలకు మళ్లించడంలో కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్పలతో పాటు ధనుంజయ రెడ్డి పాత్ర ఉందని సిట్ తేల్చింది. అయితే.. ముడుపులుగా ఎంత మొత్తం చెల్లించాలనేదానిపై ఈ ముగ్గురి విచారణలో తేలాల్సి ఉంది. దీనిపై తరచూ హైదరాబాద్, తాడేపల్లిలో మద్యం సరఫరా కంపెనీలు, డిస్టిలరీల యజమానులతో సమావేశమయ్యారని సిట్ ఇప్పటికే తేల్చింది. లిక్కర్ స్కామ్ సొమ్మును రాజ్ కసిరెడ్డి వీరికి సరఫరా చేస్తే.. వీరు ఆ మొత్తాన్ని జగన్కు అందజేసేవారని రిమాండ్ రిపోర్టుల్లో సిట్ ప్రస్తావించింది. ఈ నేపథ్యంలో మైసూరులో బాలాజీ గోవిందప్పను సిట్ అరెస్టు చేయడం సంచలనం రేకెత్తిస్తోంది.
