AP High court: ఏపీ ప్రభుత్వానికి (AP government) హైకోర్టులో చుక్కెదురైంది. రాష్ట్రంలో రోడ్ షోలు, బహిరంగ సభల నిర్వహణకు అడ్డుకట్ట వేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెం.1ని హైకోర్టు (AP High court) కొట్టివేస్తూ తీర్పు వెలువరించింది. ప్రాథమిక హక్కులకు విఘాతంగా జీఓ ఉందని హైకోర్టు అభిప్రాయపడింది. రాష్ట్రంలో సభలు, రోడ్ షోలు, ర్యాలీలపై ఆంక్షలు విధిస్తూ జీవో నెం.1ను తీసుకువచ్చిన సంగతి తెలిసిందే.
రాష్ట్ర ప్రభుత్వ జీవో నెం.1ను సవాల్ చేస్తూ సీపీఐ (cpi) నేత రామకృష్ణ, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, ఏపీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ, ఏఐఎస్ఎఫ్ ప్రతినిధులు హైకోర్టులో పిల్ వేశారు.
రోడ్ షోలను కట్టడి చేసేలా రాష్ట్ర ప్రభుత్వ జీవో ఉందని.. ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు జీవో ఇచ్చారని పిటిషన్ల తరపు న్యాయవాది కోర్టుకు విన్నవించారు. పోలీస్ యాక్ట్ 30కు భిన్నంగా జీవోనెం.1 జారీ చేశారని అన్నారు. జనవరి 24న విచారణ జరిపిన న్యాయమూర్తులు తీర్పును రిజర్వ్ చేసి నేడు జీఓ కొట్టివేస్తూ తీర్పు వెలువరించారు.