ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల ప్రతిభకు అరుదైన గుర్తింపు లభించింది. రాష్ట్ర విద్యాశాఖ ఆధ్వర్యంలో పదో తరగతి పరీక్షల్లో అత్యుత్తమ మార్కులు సాధించిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల ఫోటోలతో పత్రికల ఫ్రంట్పేజీలో ప్రత్యేక ప్రకటన విడుదల చేయడం చర్చనీయాంశంగా మారింది. ఈ వినూత్న నిర్ణయానికి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్కు అన్ని వర్గాల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
ఇప్పటి వరకు ప్రధానంగా కార్పొరేట్ పాఠశాలల విద్యార్థుల విజయాలే పత్రికల్లో ప్రాధాన్యం పొందుతుండగా, ఈసారి ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల ప్రతిభను ముందుకు తీసుకురావడం విశేషం. గ్రామీణ, సాధారణ కుటుంబాల నుంచి వచ్చిన విద్యార్థుల ప్రతిభను రాష్ట్రవ్యాప్తంగా ప్రదర్శించడం ద్వారా వారికి గుర్తింపు దక్కేలా చేయడమే ఈ చర్య వెనుక ప్రధాన ఉద్దేశమని తెలుస్తోంది.
ప్రత్యేకంగా 596 మార్కులు సాధించిన విద్యార్థుల విజయాలను హైలైట్ చేస్తూ విడుదల చేసిన ఈ ప్రకటన, ప్రభుత్వ విద్యా వ్యవస్థలో వచ్చిన మార్పులను ప్రతిబింబిస్తోంది. విద్యా ప్రమాణాల పెంపు, మౌలిక సదుపాయాల అభివృద్ధి వంటి చర్యల ఫలితంగా ఈ విజయాలు సాధ్యమయ్యాయని అధికారులు చెబుతున్నారు.
ఇటీవల కాలంలో ఇంజనీరింగ్, మెడిసిన్ వంటి కోర్సుల్లో ప్రభుత్వ సంస్థలకు విద్యార్థులు ప్రాధాన్యం ఇస్తున్న నేపథ్యంలో, పాఠశాల విద్యలో కూడా అదే ధోరణి తీసుకురావాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు భావిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలపై విశ్వాసాన్ని పెంచడంలో ఈ చర్య కీలకంగా మారుతుందని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు.
ఈ ఏడాది పదో తరగతి ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలకు పోటీగా నిలవడం గమనార్హం. కొత్త విద్యా సంవత్సరంలో అడ్మిషన్లపై కూడా ఈ ప్రభావం స్పష్టంగా కనిపించే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
