ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి అధికార యంత్రాంగం నుంచి ముందు ముందు సహాయ నిరాకరణ తప్పదా.? పరిస్థితి మరీ అంత వరకూ వెళ్ళకపోవచ్చుగానీ, జగన్ తీసుకునే అన్ని నిర్ణయాల్నీ అధికారులు సమర్థించే పరిస్థితి మాత్రం వుండకపోవచ్చనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. ముఖ్యమంత్రి అవుతూనే, వైఎస్ జగన్ మోహన్రెడ్డికి తన వేవ్ లెంగ్త్కి మ్యాచ్ అయ్యే అధికారుల్ని కీలకమైన విభాగాల కోసం ఎంచుకున్నారు.
మాజీ ఐఏఎస్ అధికారుల్ని సలహాదారులుగా నియమించుకున్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల్ని సమర్థవంతంగా అమలు చేసేందుకోసం టీమ్ని పెర్ఫెక్ట్గా ఏర్పాటు చేసుకున్నారు. ఇకనేం, ఆల్ ఈజ్ వెల్ అని వైసీపీ శ్రేణులు భావించాయి. అయితే, వంద రోజుల పాలన ముగిసేసరికి, అధికారులకీ ముఖ్యమంత్రికీ గ్యాప్ వచ్చేసిందంటూ రాజకీయ వర్గాల్లో గుసగుసలు షురూ అయ్యాయి. ప్రభుత్వానికి సంబంధించి అంతర్గత వివరాలు లీక్ అవడం కొత్తేమీ కాదు. గతంలోనూ ఇలాంటివి జరిగాయి. ఇప్పుడూ జరుగుతున్నాయి. ప్రధానంగా రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టు వంటి విషయాలపై అధికారులు, ముఖ్యమంత్రి నిర్ణయాలతో విభేదిస్తున్నారట.
Also Read: టీడీపీ ట్రెండింగ్: వైఎస్ జగన్ ‘ఫెయిల్డ్ సీఎం’
కొన్ని విభాగాలకు సంబంధించి ఉన్నతాధికారులు రాష్ట్ర ప్రభుత్వానికే కాదు, కేంద్ర ప్రభుత్వానికి కూడా జవాబుదారీగా వ్యవహరించాల్సి వస్తుంది. ఇక్కడే వ్యవహారం తేడా కొడుతోంది. పోలవరం విషయమై కేంద్రం అడుగుతున్న వివరాల్ని రాష్ట్ర ప్రభుత్వ అధికారులు అందించలేకపోతున్నారట. ‘ముఖ్యమంత్రి ఆలోచనలు కేంద్రం ఆలోచనలకు పూర్తి భిన్నంగా వున్నాయి. ఈ పరిస్థితి రాష్ట్రానికి అస్సలేమాత్రం మంచిది కాదు.’ అంటూ ఓ సీనియర్ అధికారి వ్యాఖ్యానించారంటూ మీడియాలో కథలు గుప్పుమంటోన్న విషయం విదితమే.
ఇదొక్కటే కాదు, రాష్ట్ర పరిస్థితిని పరిగణనలోకి తీసుకోకుండా సంక్షేమ పథకాల్ని కుప్పలు తెప్పలుగా తీసుకొస్తే ఎలా.? అని మరో సీనియర్ అధికారి తన అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారనే వాదన బయటకొచ్చింది. పవర్ కొనుగోళ్ళ ఒప్పందాల వ్యవహారంపైనా అధికారులకీ, రాష్ట్ర ప్రభుత్వానికీ మధ్య సఖ్యత కన్పించడంలేదట. అయితే, ఇదంతా ప్రభుత్వమ్మీద జరుగుతున్న దుష్ప్రచారమేనని అధికార పార్టీ నేతలు కొట్టి పారేస్తున్నారు. మరోపక్క 100 రోజుల పాలనకే పరిస్థితి ఇలా తయారైతే, తొలి ఏడాదిని ముఖ్యమంత్రి ఎలా పూర్తి చేస్తారు.? అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి విపక్షాలు.
