ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికీ, ప్రభుత్వ ఉద్యోగులకీ మధ్య ‘జీతాల రగడ’ తారాస్థాయికి చేరింది. ‘గొప్ప పీఆర్సీ ఇచ్చేశాం..’ అని జగన్ సర్కారు చెప్పుకుంటోంది. కానీ, ‘ఆ పీఆర్సీపై ఇచ్చిన జీవో వద్దే వద్దు’ అంటున్నారు ఉద్యోగులు. పీఆర్సీ విషయమై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇటీవల ఉద్యోగ సంఘాల నేతలతో సమావేశమైనప్పుడు, ‘సానుకూల ఫలితం’ వచ్చిందనే ప్రచారం జరిగింది.
అయితే, ‘ఇదెక్కడి పీఆర్సీ.? దీనికి ఉద్యోగ సంఘాలెలా హర్షం వ్యక్తం చేశాయి.?’ అన్న చర్చ ఉద్యోగుల్లోనూ, విపక్షాలకు చెందిన నేతల్లోనూ, సాధారణ ప్రజానీకంలోనూ జరిగింది. మబ్బులు విడిపోయాయ్. ఉద్యోగ సంఘాల నేతల కళ్ళు కూడా తెరచుకున్నాయ్. జరిగిన నష్టం, జరగబోతున్న నష్టమేంటో అర్థమయ్యింది. అంతే, మళ్ళీ జగన్ సర్కారు మీద పోరుబాట ప్రకటించేశారు.
ఇక్కడ వైసీపీ అధినాయకత్వం రచించిన వ్యూహం అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది. ఉద్యోగ సంఘాల నేతల్ని తొలుత మభ్యపెట్టడం, వారిని ఒప్పించడం.. చివరికి వారిని ఉద్యోగుల దృష్టిలో బదనాం చేయడం.. ఈ వ్యూహం ఓ పద్ధతి ప్రకారం నడిచింది. అలా ఉద్యోగ సంఘాల నేతలు నవ్వులపాలైపోయారు. ఉద్యోగులు చివరికి రోడ్డున పడే పరిస్థితి వచ్చింది.
‘తప్పు చేశాం.. వైసీపీకి అధికారం రావడంలో మేం చేసిన తప్పు అంతా ఇంతా కాదు..’ అంటూ ఉద్యోగులు లెంపలేసుకునే పరిస్థితి వచ్చింది. ఇటీవల కడప జిల్లా బద్వేలు ఉప ఎన్నికలో వైసీపీ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అక్కడే, ఉపాధ్యాయులు ‘లెంపలేసుకుని’ నిరసన తెలిపారు, ప్రభుత్వ తీరుపై. ‘కర్మ ఈజ్ బ్యాక్’ అంటే ఇదేనేమో.!
రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం పెరిగిందని ఓ వైపు చెబుతున్నారు.. అబ్బే, ఆర్థిక ఇబ్బందులున్నాయంటున్నారు. ప్రభుత్వం తరఫున వస్తున్న ప్రకటనలు, కాగ్ లెక్కలు, వైసీపీ చేసుకుంటున్న ప్రచారం.. ఒకదానికి ఒకటి పొంతన లేకుండా సాగుతోంది.
అయినా, సలహాదారుల కోసం, తమ ప్రచారం కోసం, తమ అనుకూల మీడియాని పెంచి పోషించడం కోసం వెచ్చిస్తోన్న ఖర్చుల్ని తగ్గించుకోరుగానీ, ఉద్యోగుల విషయంలో ఎందుకీ పీనాసితనం.? పైగా, దేశంలో అన్ని రాష్ట్రాలకన్నా ఏపీలోనే ఉద్యోగులకు ఎక్కువ చెల్లింపులంటూ కొత్త నాటకానికి తెరలేపడమెందుకు.? ఇదే ఉద్యోగుల్ని తీవ్ర ఆవేదనకు గురిచేస్తోంది. అందుకే, ఉద్యోగులు లెంపలేసుకుంటున్నారు.. తాము చేసిన తప్పులకు చింతిస్తూ.!
283947 823329Basically wanna remark which you have a extremely nice web website , I enjoy the layout it really stands out. 623878