ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీ ముగిసింది. రెండున్నర గంటలపాటు జరిగిన భేటీలో పలు కీలక నిర్ణయాలకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. కోనసీమ జిల్లాను అంబేడ్కర్ కోనసీమ జిల్లాగా పేరు మార్పు చేస్తూ తీసుకున్న నిర్ణయానికి ఆమోదం తెలిపింది. కొత్తగా ఏర్పడిన రెవెన్యూ డివిజన్లు, మండలాలతోపాటు దాదాపు 42 కీలక విషయాలపై కేబినెట్ చర్చించింది.
కేబినెట్ ఆమోదించిన అంశాలను పరిశీలిస్తే..
ఈనెల 27న అమ్మఒడి పథకానికి జూలైలో అమలు చేసే విద్యా కానుక, కాపు నేస్తం, జగనన్న తోడు, వాహనమిత్ర పథకాలకు కేబినెట్ ఆమోదం. రూ.15వేల కోట్లతో ఏర్పాటు కానున్న అదానీ గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుకు కేబినెట్ ఆమోదం. వైద్య శాఖలో భారీగా ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్. మెడికల్ కాలేజీలు, ఆస్పత్రుల్లో 3,530 ఉద్యోగాలు భర్తీకి ఆమోదం. వంశధార నిర్వాసితులకు రూ.216కోట్లు విడుదలకు ఆమోదం. దేవాలయాల కౌలు భూములు పరిరక్షణ చర్యలపై కేబినెట్ ఆమోదం తెలిపింది.