‘అన్నపూర్ణ తల్లి బువమ్మ’ చిత్ర షూటింగ్ పూర్తయింది. గోరి బ్రదర్స్ మీడియా, బ్లాక్ అండ్ వైట్ మూవీ మార్క్ పతాకాలపై సిరాజ్ ఖాదరన్ గోరి నిర్మాణంలో, సురేశ్ లంకలపల్లి దర్శకత్వం వహించారు. సముద్ర, శివిక, కుసుమ, సుప్రియ, నవీన్ మట్టా, రోహిల్, ఆదిల్, రూపేష్ కీలక పాత్రల్లో నటించారు.
షూటింగ్ ముగిసిన సందర్భంగా జరిగిన వేడుకలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, రాధికాపతి దాస్ ప్రభు, సాయి విజయేందర్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. బాలినేని టీమ్ సభ్యులకు షీల్డ్లు అందజేశారు.
ఈ సందర్భంగా బాలినేని మాట్లాడుతూ, “డొక్కా సీతమ్మ గారి పేరు పవన్ కళ్యాణ్ గారి వల్ల అందరికీ తెలిసింది. ఆమె సేవా భావం స్ఫూర్తిదాయకం. ఆంధ్రాలో మధ్యాహ్న భోజన పథకానికి ఆమె పేరు పెట్టడం హర్షణీయం. పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో ఒంగోలులో ఆమె పేరుతో అన్నదానం ప్రారంభిస్తాను. ఇలాంటి మంచి వ్యక్తుల కథలు ప్రజలకు తెలియాలి” అన్నారు.
డొక్కా సీతమ్మ పాత్రలో నటించిన శివిక, “నా తొలి సినిమా ఇది. మంచి పాత్ర దక్కింది. న్యాయం చేశానని అనుకుంటున్నా” అని చెప్పగా, సముద్ర, “సీతమ్మ గారి భర్తగా నటించడం అదృష్టం. ఇలాంటి సినిమాలు అరుదుగా వస్తాయి” అన్నారు.
దర్శకుడు సురేశ్ లంకలపల్లి, “ప్రేక్షకులు తెరపై చూసి మా కష్టాన్ని అంచనా వేస్తారు. మంచి సినిమా తీశానని నమ్మకంగా చెప్పగలను” అన్నారు. నిర్మాతలు త్వరలో పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసి సినిమాను విడుదల చేస్తామని తెలిపారు.
