అమరావతి: గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆంధ్ర యూనివర్సిటీని వైసీపీ కార్యాలయంగా మార్చేశారని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి Nara Lokesh శాసనసభలో తీవ్రంగా విమర్శించారు. ప్రశ్నోత్తరాల సమయంలో విశాఖ సిటీ ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణబాబు, గణబాబు, వంశీకృష్ణ శ్రీనివాస్ ఆంధ్ర యూనివర్సిటీలో జరిగిన అక్రమాలపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. అలాగే వర్సిటీలోని వసతి గృహాలు, విభాగాల్లో పనిచేస్తున్న రోజువారీ వేతన సిబ్బంది, ఎన్ఎంఆర్, 28 రోజుల వేతన ఉద్యోగులను కనీస వేతన శ్రేణి ఉద్యోగులుగా పరిగణించి, దీర్ఘకాలంగా పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని విజ్ఞప్తి చేశారు.
దీనిపై స్పందించిన మంత్రి లోకేష్, గత ఐదేళ్లలో ఏపీలోని ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో వైసీపీ కార్యకర్తలను విచ్చలవిడిగా వివిధ పోస్టుల్లో నియమించుకున్నారని ఆరోపించారు. ప్రస్తుతం అన్ని విశ్వవిద్యాలయాల్లో ప్రత్యేకంగా మ్యాన్ పవర్ ఆడిట్ నిర్వహిస్తున్నామని తెలిపారు. రాబోయే 30 రోజుల్లో ఆడిట్ పూర్తి చేసి, అనర్హులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. కాంట్రాక్ట్, ఎంటిఎస్ సిబ్బంది రెగ్యులరైజేషన్ అంశాన్ని మ్యాన్ పవర్ ఆడిట్ అనంతరం ఫైనాన్స్ శాఖతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
మాజీ వీసీ ప్రసాదరెడ్డి అవకతవకలపై విజిలెన్స్ విచారణ కొనసాగుతోందని, ఆ నివేదిక 45 రోజుల్లో రానుందని వెల్లడించారు. నివేదిక వచ్చిన వెంటనే తగిన కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి లోకేష్ పేర్కొన్నారు. ఆంధ్ర యూనివర్సిటీ 2019లో ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్లో 29వ స్థానంలో ఉండగా, 2023 నాటికి 76వ స్థానానికి పడిపోయిందని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పరిస్థితిని మెరుగుపరచి 41వ ర్యాంకుకు తీసుకొచ్చామని చెప్పారు. ఇప్పుడు టాప్-10లోకి తీసుకురావాలనే లక్ష్యంతో చర్యలు చేపడుతున్నామని వివరించారు. యూనివర్సిటీ కేటగిరీలో కూడా 2019లో 16వ ర్యాంక్లో ఉన్న ఏయూ, 2023లో 43వ స్థానానికి పడిపోయిందని, ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత 2025 నాటికి 23వ ర్యాంకుకు తీసుకొచ్చామని వెల్లడించారు.
ఆంధ్ర యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని సభ్యులు కోరగా, రేపు విశాఖ పర్యటనలో వీసీని కలిసి కార్యక్రమాల నిర్వహణపై సమీక్షిస్తానని మంత్రి లోకేష్ తెలిపారు. సభ్యులు తమ సూచనలు అందిస్తే శతాబ్ది వేడుకలను మరింత వైభవంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. రాష్ట్రంలో ఉన్నత విద్యా ప్రమాణాలను పెంచడం, విశ్వవిద్యాలయాల ప్రతిష్ఠను జాతీయ స్థాయిలో మరింతగా నిలబెట్టడం ప్రభుత్వ లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు.
