ఆంధ్రప్రదేశ్లో జనాభా నిర్మాణంలో వేగంగా జరుగుతున్న మార్పులను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర జనాభా నిర్వహణ విధానాన్ని అమలు చేయడానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు జనాభా నియంత్రణపై దృష్టి పెట్టిన విధానాల నుంచి బయటకు వచ్చి, భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని “Population Control” నుంచి “Population Care” వైపు ప్రభుత్వం అడుగులు వేస్తోంది. మాతృత్వం, మహిళా సాధికారత, వృద్ధుల సంక్షేమం, నైపుణ్యాభివృద్ధి, డిజిటల్ ఆరోగ్య వ్యవస్థ అనే ఐదు ప్రధాన స్తంభాల ఆధారంగా ఈ విధానాన్ని రూపొందిస్తున్నారు. జనాభా తగ్గుదల, వృద్ధుల సంఖ్య పెరుగుదల వంటి సవాళ్లను ఎదుర్కొనేందుకు దీర్ఘకాలిక వ్యూహాన్ని ప్రభుత్వం సిద్ధం చేస్తోంది.
రాష్ట్రంలోని జనాభా గణాంకాలు ప్రస్తుతం ఆందోళన కలిగించే విధంగా మారుతున్నాయి. ఒకప్పుడు అధికంగా ఉన్న జననాల రేటు ప్రస్తుతం గణనీయంగా తగ్గిపోయింది. 1992లో ఆంధ్రప్రదేశ్లో మొత్తం సంతానోత్పత్తి రేటు (Total Fertility Rate) 3.0గా ఉండగా, 2002 నాటికి అది 2.2కి పడిపోయింది. తాజాగా 2022-23 నాటికి ఈ రేటు 1.5కి చేరింది. అంటే, జనాభా స్థిరంగా కొనసాగడానికి అవసరమైన 2.1 Replacement Level కంటే దాదాపు 28 శాతం తక్కువగా ఉంది. ఈ పరిస్థితి కొనసాగితే 2040 నాటికి రాష్ట్రంలో పనిచేసే వయస్సు గల జనాభా అధికంగా ఉండే “Demographic Window” ముగిసే ప్రమాదం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.
ఇక ఇతర కీలక సూచీలను పరిశీలిస్తే కూడా రాష్ట్రం ముందున్న సవాళ్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం మిడియన్ వయస్సు 32.5 సంవత్సరాలు ఉండగా, దేశ సగటు 28.4 సంవత్సరాలు మాత్రమే ఉంది. అంటే రాష్ట్రంలో వృద్ధాప్య జనాభా వేగంగా పెరుగుతోందని అర్థం. ప్రస్తుతం 60 ఏళ్లు దాటిన జనాభా సుమారు 10 శాతం ఉండగా, 2047 నాటికి అది 23 శాతానికి చేరే అవకాశం ఉందని అంచనా. అదే సమయంలో మహిళల ఉద్యోగాల్లో భాగస్వామ్యం కూడా తక్కువగానే ఉంది. రాష్ట్రంలో మహిళల ఉద్యోగ భాగస్వామ్యం 31 శాతం ఉండగా, దేశ సగటు దాదాపు 37 శాతంగా ఉంది.
ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఐదు కీలక స్తంభాల ఆధారంగా జనాభా నిర్వహణ వ్యూహాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. మొదటి స్తంభం మాతృత్వం. ఇందులో సురక్షిత మాతృత్వం, సమాచారంతో కూడిన కుటుంబ నిర్ణయాలను ప్రోత్సహించడం ప్రధాన లక్ష్యం. ప్రస్తుతం కుటుంబ నియంత్రణలో అధికంగా ఉపయోగిస్తున్న స్టెరిలైజేషన్పై ఆధారాన్ని 70 శాతం నుంచి 50 శాతం కంటే తక్కువకు తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో IVF సేవలను అందుబాటులోకి తీసుకురావడం, సిజేరియన్ ప్రసవాల రేటును ప్రస్తుతం ఉన్న 67.5 శాతం నుంచి 40 శాతం కంటే తక్కువకు తగ్గించడం కూడా లక్ష్యంగా పెట్టుకున్నారు. అలాగే టీనేజ్ గర్భధారణను ప్రస్తుతం ఉన్న 8.8 శాతం నుంచి 3 శాతం లోపుకు తగ్గించేందుకు చర్యలు చేపడుతున్నారు.
రెండవ స్తంభం మహిళా సాధికారత. మహిళలు ఉద్యోగాల్లో ఎక్కువగా పాల్గొనేలా అనుకూల వాతావరణం కల్పించడంపై ప్రభుత్వం దృష్టి పెడుతోంది. ఉద్యోగ స్థలాల్లో చైల్డ్కేర్ సదుపాయాలు, క్రెచ్లు ఏర్పాటు చేయడం, పని చేసే మహిళలకు హాస్టళ్లు అందించడం, తల్లిదండ్రులకు కలిపి పేరెంటల్ లీవ్ విధానాన్ని అమలు చేయడం వంటి చర్యలను తీసుకోనున్నారు. ఈ చర్యల వల్ల రాష్ట్ర స్థూల ఆర్థికోత్పత్తి (GSDP)లో దాదాపు 15 శాతం వరకు వృద్ధి సాధ్యమవుతుందని అంచనా వేస్తున్నారు.
మూడవ స్తంభం వృద్ధుల సంక్షేమం. రాష్ట్రంలో పెరుగుతున్న వృద్ధ జనాభా అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఆరోగ్య సేవలను విస్తరించనున్నారు. జిల్లా స్థాయిలో జీరియాట్రిక్ వార్డులు ఏర్పాటు చేయడం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు మరియు కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో వృద్ధుల ఆరోగ్య క్లినిక్లు ప్రారంభించడం వంటి చర్యలు చేపడతారు. అలాగే “సిల్వర్ స్కిల్స్ రిజిస్ట్రీ” ద్వారా సుమారు 50 వేల మంది వృద్ధులకు ఉపాధి అవకాశాలు కల్పించనున్నారు. రిటైర్ అయ్యే ఉద్యోగులకు ఆరోగ్య పరిరక్షణ కోసం 50 వేల రూపాయల వరకు వెల్నెస్ లీవ్ ప్రయోజనాన్ని కూడా అందించే ఆలోచనలో ప్రభుత్వం ఉంది.
నాలుగవ స్తంభం నైపుణ్యాభివృద్ధి. రాష్ట్రంలో పెట్టుబడులు, పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా యువతకు అవసరమైన నైపుణ్యాలను అందించడంపై ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రానికి వచ్చిన 610 అవగాహన ఒప్పందాల ద్వారా దాదాపు 13 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు రావాల్సి ఉంది. వాటికి అనుగుణంగా 75 శాతం స్కిల్లింగ్ పూర్తి చేసి, కనీసం 80 శాతం ఉద్యోగ అవకాశాలు కల్పించేలా లక్ష్యాన్ని నిర్దేశించారు. ప్రతి సంవత్సరం 5000 మంది చైల్డ్ కేర్ టేకర్స్, మరో 5000 మంది వృద్ధ సంరక్షణ సహాయకులను తయారు చేసే ప్రణాళికను రూపొందిస్తున్నారు.
ఐదవ స్తంభం డిజిటల్ పబ్లిక్ హెల్త్ సిస్టమ్. సంజీవని అనే పేరుతో రూపొందిస్తున్న ఈ వ్యవస్థ ద్వారా ఆరోగ్య సేవలను డిజిటల్ ప్లాట్ఫారమ్లో అందుబాటులోకి తీసుకురానున్నారు. కుప్పంలో పైలట్ ప్రాజెక్ట్గా ఇప్పటికే ఈ కార్యక్రమం ప్రారంభమైంది. అక్కడ సుమారు 3.01 లక్షల జనాభాను డిజిటల్ ఆరోగ్య సేవల పరిధిలోకి తీసుకువచ్చారు. 106 ఆరోగ్య కేంద్రాలను ఈ వ్యవస్థతో అనుసంధానించారు. అక్కడ 100 శాతం నాన్ కమ్యూనికబుల్ వ్యాధుల స్క్రీనింగ్ పూర్తయ్యింది. 2026 నాటికి రాష్ట్రంలోని మొత్తం 5.2 కోట్ల జనాభాను ఈ డిజిటల్ ఆరోగ్య వ్యవస్థలోకి తీసుకురావడం లక్ష్యంగా పెట్టుకున్నారు.
అదే సమయంలో కుటుంబాలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రోత్సాహక ప్యాకేజీని కూడా సిద్ధం చేస్తోంది. పోషణ-శిక్ష-సురక్ష కార్యక్రమం ద్వారా రెండో బిడ్డకు 25 వేల రూపాయల ప్రోత్సాహకాన్ని అందించే ప్రణాళిక ఉంది. తల్లులు, పిల్లల ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు పోషణ కార్యక్రమాలు అమలు చేసి, మాతృ మరణాలు మరియు శిశు మరణాలను తగ్గించడంపై దృష్టి పెట్టనున్నారు. పిల్లలకు 18 సంవత్సరాల వరకు ఉచిత విద్య, కుటుంబ ఆరోగ్య బీమా, ప్రభుత్వ ఆసుపత్రుల్లో IVF సబ్సిడీ వంటి ప్రయోజనాలను కూడా అందించనున్నారు.
ఈ విధానం అమలులోకి వస్తే జనాభా తగ్గుదల, వృద్ధ జనాభా పెరుగుదల వంటి భవిష్యత్ సవాళ్లను ఎదుర్కొనేందుకు ఆంధ్రప్రదేశ్ ముందుగానే సిద్ధమవుతుందని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. సమగ్ర జనాభా నిర్వహణ ద్వారా ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణం మరియు ఆర్థికాభివృద్ధికి ఇది దోహదం చేస్తుందని అధికారులు పేర్కొంటున్నారు.
