ఉండవల్లి నివాసంలో గంజాయి, డ్రగ్స్ నియంత్రణపై మంత్రివర్గ ఉపసంఘం సమావేశం జరిగింది. హోంమంత్రి వంగలపూడి అనిత అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో మంత్రులు నారా లోకేష్, కొల్లు రవీంద్ర, సత్యకుమార్ యాదవ్, గుమ్మడి సంధ్యారాణి, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, ఈగల్ ఐజీ ఆకే రవికృష్ణతో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
అధికారులు ఇప్పటివరకు చేపట్టిన చర్యలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. గంజాయి సాగు విస్తీర్ణం తగ్గుదలపై సభ్యులు సమీక్షించారు. సరిహద్దు రాష్ట్రాల్లో గంజాయి రవాణాను అరికట్టేందుకు సమన్వయం పెంచాలని సూచించారు. కొండ ప్రాంతాల్లో సాగును గుర్తించేందుకు శాటిలైట్ చిత్రాలు, డ్రోన్లు, ఏఐ టెక్నాలజీ వినియోగించాలని నిర్ణయించారు.
గంజాయి, మాదకద్రవ్యాల వినియోగ దుష్పరిణామాలపై విద్యాసంస్థల్లో నెలలో ఒక శనివారం అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. అక్రమ రవాణా నెట్ వర్క్ ఆర్థిక మూలాలను ఛేదించి నేరస్తులపై ఉక్కుపాదం మోపాలని ఉపసంఘం స్పష్టం చేసింది. కేసులపై త్వరితగతిన ఛార్జిషీట్లు వేసి శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ప్రజల నుంచి సమాచారాన్ని సేకరించి హాట్ స్పాట్లను గుర్తించాలని, గిరిజనులను గంజాయి సాగు నుంచి దూరం చేయడానికి ఐటీడీఏ, గిరిజన సంక్షేమ శాఖలు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు. కేసుల పురోగతి, నిఘా సమాచారం, శాటిలైట్, డ్రోన్ విశ్లేషణ కోసం ఆర్టీజీఎస్ ఆధ్వర్యంలో ప్రత్యేక డ్యాష్బోర్డు రూపొందించాలని ఆదేశించారు.
గంజాయి, డ్రగ్స్ నియంత్రణకు ఇతర రాష్ట్రాల్లో అమలు చేస్తున్న ఉత్తమ విధానాలను అధ్యయనం చేయాలని నిర్ణయించారు. మత్తుకు బానిసలైన వారిని రక్షించేందుకు ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో డి-అడిక్షన్ కేంద్రాల నిర్వహణకు సమగ్ర కార్యాచరణ రూపొందించాలని మంత్రివర్గ ఉపసంఘం ఆదేశించింది.
