ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడుల జోరు కొనసాగుతోంది. పరిశ్రమలకు వేగంగా అనుమతులు ఇవ్వడంపై దృష్టి పెట్టిన ప్రజాప్రభుత్వం, “స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్” విధానంతో భారీ స్థాయిలో పెట్టుబడులను ఆకర్షిస్తోంది. 2024 జూన్ నుంచి ఇప్పటి వరకు నిర్వహించిన 17 ఎస్ఐపీబీ సమావేశాల్లో మొత్తం 283 ప్రాజెక్టులకు ఆమోదం లభించింది. ఈ ప్రాజెక్టుల ద్వారా రాష్ట్రానికి రూ.11,37,222 కోట్ల పెట్టుబడులు రానుండగా, 10,01,147 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి.
పరిశ్రమల రంగంలోనే అత్యధికంగా 85 ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ లభించింది. ఈ ప్రాజెక్టుల ద్వారా రూ.4,44,442 కోట్ల పెట్టుబడులు రానుండగా, 3,28,907 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని ప్రభుత్వం వెల్లడించింది.
ఇంధన రంగంలో కూడా భారీ పెట్టుబడులు నమోదయ్యాయి. మొత్తం 82 ప్రాజెక్టులకు ఆమోదం తెలపగా, వీటి ద్వారా రూ.3,87,809 కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి రానున్నాయి. ఈ రంగంలోనే అత్యధికంగా 4.62 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి.
ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో 52 ప్రతిపాదనలకు ఆమోదం లభించింది. ఈ ప్రాజెక్టుల ద్వారా రూ.2,85,347 కోట్ల పెట్టుబడులు రానుండగా, 1,82,126 మందికి ఉద్యోగాలు కల్పించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. పర్యాటక రంగంలో 42 ప్రాజెక్టుల ద్వారా రూ.9,639 కోట్ల పెట్టుబడులు, 17,558 ఉద్యోగాలు రానున్నాయి.
ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో 20 ప్రాజెక్టులకు ఆమోదం లభించగా, రూ.8,322.98 కోట్ల పెట్టుబడులతో 8,450 మందికి ఉపాధి అవకాశాలు ఏర్పడనున్నాయి. మౌలిక సదుపాయాల కల్పన శాఖలో 2 ప్రాజెక్టుల ద్వారా రూ.1,666 కోట్ల పెట్టుబడులు, 2,050 ఉద్యోగాలు లభించనున్నాయి.
ఇప్పటికే రూ.5 లక్షల కోట్ల నుంచి రూ.6 లక్షల కోట్ల విలువైన పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు పూర్తయ్యాయని, ప్రస్తుతం పలు పారిశ్రామిక యూనిట్లు నిర్మాణ దశలో ఉన్నాయని అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలో పెట్టుబడులకు అనుకూల వాతావరణం, వేగవంతమైన అనుమతులు, పారిశ్రామిక మౌలిక వసతులు కారణంగా అంతర్జాతీయ, జాతీయ సంస్థలు ఏపీ వైపు మొగ్గు చూపుతున్నాయని ప్రభుత్వం చెబుతోంది.
