టీటీడీ పరకామణి చోరీ ఘటనపై మంత్రివర్గ సభ్యుడు ఆనం రాంనారాయణరెడ్డి మరోసారి వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. చిన్న వ్యవహారంగా చెప్పి భక్తుల విశ్వాసాలను తక్కువ చేసి మాట్లాడడం బాధాకరమని ఆయన అన్నారు. పరకామణి చోరీని చిన్న అంశంగా చూస్తే, తన దృష్టిలో పెద్ద దోపిడీ ఏంటో కూడా జగనే చెప్పాలని ఆనం మండిపడ్డారు. 70 వేల రూపాయలు దొంగిలించిన వ్యక్తి.. రాజీ కోసం కోట్ల విలువైన ఆస్తులు ఎలా రాసుకున్నాడో ప్రజలకు చెప్పాల్సిందిగా ప్రశ్నించారు.
జగన్ పాలనలో పరకామణి చోరీ నిరంతర ప్రక్రియగా సాగిందనీ, ఒక రోజు మాత్రమే సీసీ కెమెరాల్లో కనిపించిన దొంగ.. మొత్తం వ్యవస్థలో ఉన్న రేణువులాంటివాడేనని ఆనం వ్యాఖ్యానించారు. పవిత్రమైన తిరుమలలో పాలచుక్క కూడా లేకపోయినా ప్రసాదానికి నెయ్యి కనిపెట్టడం జగన్ పాలనలో జరిగిన పెద్ద వింత అని ఎద్దేవా చేశారు. దొంగ చేతికి తాళాలు ఇస్తే ఎలా ఉంటుందో గత ఐదు సంవత్సరాల్లో ప్రజలు చూసారని ఆయన అన్నారు.
టీటీడీపై జగన్ చేసిన తాజా వ్యాఖ్యలు ప్రజలు ఇంకా మర్చిపోని ఐదు సంవత్సరాల మాఫియా పాలనను గుర్తుకు తెస్తున్నాయన్నారు. ప్రతి వ్యవస్థలో బంధు గణాన్ని పెట్టి దోపిడీకి తలుపులు తెరిచారని ఆరోపించారు. స్వామివారి ప్రసాదం వంటి పవిత్రమైన వ్యవస్థలలో కూడా దగా జరిగినట్లు విమర్శించారు. దొంగే దొంగా అని పరిగెత్తినట్లే జగన్ వ్యవహారం ఉందని ఆనం వ్యాఖ్యానించారు.
మొత్తానికి, జగన్.. మాఫియా సామ్రాజ్యానికి అధినేత కావడంతో వాస్తవాలు వినడానికే సిద్ధంగా లేరని, అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఆ సామ్రాజ్యాన్ని కట్టడి చేస్తుందని మంత్రి ఆనం స్పష్టం చేశారు. పరకామణి చోరీ వ్యవహారంపై నిజాలు బయటపడతాయని, భక్తుల నమ్మకాన్ని నిలబెట్టడం ప్రభుత్వ బాధ్యతేనని తెలిపారు.
Live Link: https://youtube.com/live/IarYNbiKSTE?feature=share
