ఉమ్మడి తెలుగు రాష్ట్రం రెండుగా విడిపోయింది 2014లో. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని వుందో, లేదో తెలియని దుస్థితి. ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ గతంలో, అమరావతిని రాజధానిగా నిర్ణయిస్తూ, తీర్మానం చేసింది. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు, అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్.. అమరావతికి అనుకూలంగా మాట్లాడారు.
కాలగమనంలో, అమరావతితోపాటు మరో రెండు రాజధానులు తెరపైకి తెచ్చి, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మూడు ముక్కలాట ఆడారు. ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీలోనే, మూడు రాజధానులకు అనుకూలంగా తీర్మానం చేశారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ముఖ్యమంత్రి హోదాలో.
కానీ, ఆ మూడు రాజధానులకు న్యాయస్థానాల్లో చుక్కెదెరయ్యింది. మూడు రాజధానుల బిల్లు కూడా వెనక్కి తీసుకోబడింది. మరోమారు, అమరావతిని రాజధానిగా నిర్ణయిస్తూ, ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, చంద్రబాబు ముఖ్యమంత్రి హోదాలో తీర్మానం చేయడం జరిగింది.
ఈసారి, అసెంబ్లీ తీర్మానం కేంద్రానికి చేరింది. పార్లమెంటు ఉభయ సభల్లో, అమరావతికి చట్టబద్ధత కల్పించేలా, విభజన చట్టానికి సవరణలు చేయడం గమనార్హం. పార్లమెంటు ఉభయ సభల ఆమోదం నేపథ్యంలో, రాష్ట్రపతి కూడా అమరావతికి ఆమోద ముద్ర వేశారు.
రాజముద్ర పడింది.. పుష్కర కాలం తర్వాత, రాజధాని ఏదన్న ప్రశ్నకు సరైన సమాధానం దొరికింది ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకు. ఏకైక రాజధాని అమరావతి మాత్రమే. ఇప్పుడిక, చంద్రబాబు సర్కార్ ముందున్న లక్ష్యం.. రాజధాని అమరావతిలో అభివృద్ధిని పరుగులు పెట్టించడమే.
రాజధానికి చట్టబద్ధత కల్పించాల్సిన పరిస్థితి రావడం, ఈ క్రమంలో నానా రకాల ఇబ్బందులూ తలెత్తడం.. ఇదంతా ఓ ప్రసహనం. ఏ కారణంతో అమరావతికి వైఎస్ జగన్ మోకాలడ్డినా, అదీ ఓ రకంగా మంచిదే అయ్యింది. అమరావతికి, కేంద్రమే చట్టబద్ధత కల్పించిందిప్పుడు.
‘ప్రభుత్వం మారితే, అసెంబ్లీలో ఇంకో తీర్మానం చేస్తాం..’ అంటూ రాజధానిని మార్చేస్తామనే సంకేతాల్ని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ‘మావిగన్’ పేరుతో పంపుతున్నారుగానీ, అది ఇకపై కుదరని పని. వైఎస్ జగన్ డ్రామాలకు కాలం చెల్లింది. అమరావతి మాత్రమే, రాష్ట్రానికి ఏకైక రాజధాని.. అని డిసైడ్ అయిపోయింది.
బీజేపీ, టీడీపీ, జన సేన నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం, ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకు ఇచ్చిన అపురూపమైన కానుక, అమరావతికి చట్టబద్ధత.. అని నిస్సందేహంగా చెప్పొచ్చు. రాజధానిపై ఇంకా విషం చిమ్మాలని వైసీపీ అనుకుంటే, అంతకన్నా హాస్యాస్పదం ఇంకోటుండదు.
