జనసేన అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మీద సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేస్తున్నవారిలో ఎక్కువగా అల్లు అర్జున్ అభిమానులే కనిపిస్తున్నారు. సినిమా కోణంలో ట్రోల్స్ అంటే, వివిధ హీరోలకు చెందిన అభిమానులు చేయడం.. కొత్తేమీ కాదు.
పవన్ కళ్యాణ్ అభిమానుల్లోనూ కొందరు, ఇతర హీరోలను ట్రోల్ చేసిన దాఖలాలూ లేకపోలేదు. సినిమా అన్నాక ఇలాంటివి మామూలే. ఓ దశ వరకూ ట్రోలింగ్ మరీ నేరమేమీ కాదు. కాకపోతే, హద్దులు దాటే ట్రోలింగ్ మాత్రం క్షమార్హం కాదు. అల్లు అర్జున్ అభిమానుల పేరుతో కొందరు, అన్ని హద్దులూ దాటేస్తున్నారు.
తాజాగా, పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజినెవా మీదా, పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ మీదా అత్యంత అసభ్యకరమైన వ్యాఖ్యలతో ట్రోలింగ్ చేశారు కొందరు అల్లు అర్జున్ అభిమానులు. వాళ్ళలో కొందరిపై కేసులు నమోదయ్యాయి, అందులో కొందరి అరెస్టు కూడా జరిగింది.
ఆరా తీస్తే, వాళ్ళలో కొందరు వైసీపీ సపోర్టర్స్గా తేలింది. వైసీపీ కార్యకర్తలే, అల్లు అర్జున్ ముసుగేసుకుని, గత ఎన్నికల సమయంలో, పవన్ కళ్యాణ్ని అత్యంత నీఛంగా ట్రోల్స్ చేశారు. పవన్ కళ్యాణ్, ఏపీ డిప్యూటీ సీఎం అయ్యాక, వాళ్ళు మరింతగా చెలరేగిపోయారు.
నిజానికి, అలాంటివారిని ‘దూరం’గా పెట్టే అవకాశం అల్లు అర్జున్కి లేకపోలేదు. కానీ, అల్లు అర్జున్ ఎందుకో, అభిమానుల్ని ఎంకరేజ్ చేస్తున్నట్లే వుంది ఇలాంటి విషయాల్లో. వైసీపీకి చెందిన ఓ నాయకుడితో అల్లు అర్జున్కి సన్నిహిత సంబంధాలు వుండడమే కారణమా.? అన్న అనుమామాలూ లేకపోలేదు.
‘నా ఆర్మీ మీరు’ అంటూ అభిమానుల్ని, వారు చేసే వెకిలి చేష్టల్నీ అల్లు అర్జున్ ఎండార్స్ చేస్తున్నట్లుగా వుండడంతో, విషయం మరింత ముదిరి పాకాన పడుతోంది. అదే సమయంలో, అల్లు అర్జున్ అభిమానుల ముసుగులో ఏం చేసినా చెల్లిపోతుందని వైసీపీ క్యాడర్ కూడా మరింత దిగజారిపోతున్నారు.
ఈ విషయంలో అల్లు అర్జున్ ఇప్పటికైనా, ఓ నిర్ణయం తీసుకుని, తన ‘ఆర్మీ’ని అదుపులో పెట్టుకుంటే మంచిది.
