Allu Arjun: ‘పుష్ప’ సినిమా తర్వాత అల్లు అర్జున్ రేంజ్ పాన్ ఇండియా స్థాయికి పెరిగిపోయింది. ఇదే దూకుడుతో బన్నీ మరో అరుదైన ఘనత సాధించారు. దేశంలో అత్యంత బ్రాండ్ వాల్యూ కలిగిన అగ్రశ్రేణి 25 మంది జాబితాలో అల్లు అర్జున్ తొలిసారి చోటు దక్కించుకున్నారు. 2022 ఏడాదికి గాను ‘సెలబ్రిటీ బ్రాండ్ వాల్యూయేషన్ స్టడీ’ నివేదికను ఆర్థిక సలహాల సంస్థ క్రోల్ ఇటీవలే విడుదల చేసింది. ఇందులో అగ్రశ్రేణి 25 మంది ప్రముఖుల బ్రాండ్ విలువ 160 కోట్ల డాలర్ల మేరకు ఉంది. 2021 తో పోలిస్తే ఇది 29.1% ఎక్కువ .
ఈ జాబితాలో ప్రముఖ బాలీవుడ్ నటుడు రన్ వీర్ సింగ్ రూ. 1500 కోట్లు (18 కోట్ల డాలర్లు) తో మొదటి స్థానంలో నిలిచారు. టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ రూ.1450 కోట్లు (17.69 కోట్ల డాలర్లు) రెండో స్థానంలో ఉన్నారు. అక్షయ్ కుమార్ రూ.1260 కోట్లు (15.36 కోట్ల డాలర్లు), అలియా భట్ రూ.850 కోట్లు (10.29 కోట్ల డాలర్లు) దీపికా పదుకొనే రూ. 680 కోట్లు (8. 29 కోట్ల డాలర్లు) ఉన్నారు.
అల్లు అర్జున్ రూ.260 కోట్లు (3.14 కోట్ల డాలర్లు) బ్రాండ్ విలువతో 20వ స్థానంలో నిలిచారు. ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు రూ. 219 కోట్లతో 23వ స్థానంలో ఉండగా..సినీనటి రష్మిక మందన్న రూ. 209 కోట్లు బ్రాండ్ విలువతో 25 వ స్థానంలో నిలిచారు. టీమిండియా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా, ఒలింపిక్స్ లో బంగారు పతకం సాధించిన నీరజ్ చోప్రా తొలిసారి ఈ జాబితాలో చోటు సంపాదించడం విశేషం.