Mukul Dev: తెలుగులో పలు సినిమాల్లో విలన్ గా నటించిన బాలీవుడ్ నటుడు ‘ముకుల్ దేవ్’ కన్నుమూశారు. ఆయన వయసు 54ఏళ్లు. కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ముంబైలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతి చెందారు. ఆయన కుటుంబసభ్యులు ఈ విషయాన్ని వెల్లడించారు.
తెలుగులో ప్రముఖ విలన్ గా జై చిరంజీవ, అతడు, సింహాద్రి, సీతయ్య.. వంటి సినిమాల్లో నటించిన రాహుల్ దేవ్ సోదరుడే ముకుల్ దేవ్. దస్తక్ హిందీ సినిమాతో పరిచయమైన ముకుల్ దేవ్.. తెలుగుతోపాటు హిందీ, పంజాబీ, కన్నడ సినిమాల్లోనూ నటించారు. టెలివిజన్ సీరియల్స్ తో ముకుల్ దేవ్ తన కెరీర్ మొదులుపెట్టారు.
రవితేజ హీరోగా తెరకెక్కిన కృష్ణతో దర్శకుడు వి.వి.వినాయక్ ఆయన్ను తెలుగులో పరిచయం చేశారు. అటుపై అదుర్స్, సిద్ధం, మనీ మనీ మోర్ మనీ, భాయ్, నిప్పు.. వంటి సినిమాల్లో నటించారు. ఆయన నటించిన ఆఖరు సినిమా ‘అంత్ ది ఎండ్’. ముకుల్ దేవ్ మృతిపై పలువురు విచారం వ్యక్తం చేశారు.
