Chandra babu: సుమారు 36 గంటల ఉత్కంఠకు తెర దించుతూ స్కిల్ డెవలప్మెంట్ (Skill Development) స్కామ్ కేసులో విజయవాడ ఏసీబీ కోర్టు (ACB court) తీర్పు వెలువరించింది. కేసులో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandra babu) కు చుక్కెదురైంది. 14 రోజులు (సెప్టెంబర్ 22) రిమాండ్ విధిస్తూ ఏసీబీ కోర్టు తీర్పు ఇచ్చింది. ఉదయం 8గంటల నుంచి మధ్యాహ్నం 2.30 గంటల వరకూ ఇరు పక్షాల మధ్య సుదీర్ఘ వాదనలు జరిగాయి. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి చంద్రబాబుకు రిమాండ్ విధించారు. దీంతో చంద్రబాబును రాజమహేంద్రవరం జైలుకు తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో ఏపీలో సోమవారం 144 సెక్షన్ విధించారు. చంద్రబాబును రోడ్డు మార్గంలో తీసుకెళ్తే భద్రతా సమస్యలు తలెత్తే అవకాశం ఉందని వాయు మార్గంలో తీసుకెళ్లేందుకు పోలీసులు నిర్ణయించారు. కోర్టు తీర్పు అనంతరం మరో రెండు పిటిషన్లు చంద్రబాబు తరపు న్యాయవాదులు కోర్టు ముందుంచారు. గృహ నిర్భంధంలో ఉంచాలని.. ఇంటి నుంచి భోజనం, మందులు అందించాలని, బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేశారు.