Sudan: సైన్యం, పారామిలిటరీ బలగాల మధ్య ఆధిపత్య పోరుతో సుడాన్ (Sudan) ప్రజలకు శాపంగా మారింది. ఇంటర్నేషనల్ మీడియా వార్తల ప్రకారం.. ఘర్షణలతో మొత్తంగా 200 మంది చిన్నారులు మృతి చెందినట్టు తెలుస్తోంది. 6వారాల వ్యవధిలో రాజధాని ఖర్తూమ్ (Khartoum) లోని అనాధ శరణాలయంలో 60మంది శిశువులు, చిన్నారులు ఆకలిని తట్టుకోలేక మృతి చెందినట్టు తెలుస్తోంది.
రెండు రోజుల వ్యవధిలోనే 26 మంది చనిపోవడం అక్కడి దారుణ పరిస్థితికి అద్దం పడుతోంది. శరణాలయ సిబ్బంది వెల్లడించిన వివరాల ప్రకారం చిన్నారులకు ఆహారం, నీరు లభించక, వైద్యం అందక మృతి చెందినట్టు తెలుస్తోంది. ఓ గదిలో చిన్నారులు ఆకలికి అలమటించడం.. ఒకామె నీటిని అందించడం.. చనిపోయిన చిన్నారులను వస్త్రంలో ఉంచడం కలవరపెడుతోంది.
విషయం తెలుసుకున్న యూనిసెఫ్ (Unicef), రెడ్ క్రాస్ (Red cross) సంస్థలతో కలిసి స్థానిక సంస్థ ఆహారం, మెడిసిన్, బేబీ ఫార్ములా కిట్లను అందించింది. ఈ మరణాలు మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు. ఘర్షణల్లో ఇప్పటికి 900 మంది మరణించగా.. 1.65 మిలియన్ల మంది సొంత ప్రాంతాలను వీడిపోయారు.