Train Accident: దేశాన్నే కుదిపేసిన కోరమాండల్ (Coromandel) ఎక్స్ ప్రెస్ ప్రమాద ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ ప్రమాదంలో 278 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ప్రమాద తీవ్రతకు బోగీల మధ్య నలిగి చిధ్రమైపోయిన మృతదేహాలు ఓపక్క.. గాయాలే కనిపించని మృతదేహాలు మరోపక్క కనిపించాయి. దీంతో వీరు విద్యుద్ఘాతం వల్ల చనిపోయినట్టు అధికారులు భావిస్తున్నారు. ఇలా 40మంది వరకూ చనిపోయి ఉండొచ్చని రైల్వే పోలీసులు (Railway police) భావిస్తున్నారు.
కోరమాండల్ ఎక్స్ ప్రెస్ (Coromandel) గూడ్స్ ను ఢీకొట్టి కొన్ని బోగీలు పక్క ట్రాక్ పై పడ్డాయి. ఆ సమయంలో బెంగళూరు-హౌడా ఎక్స్ ప్రెస్ రావడంతో ఆ రైలును ఢీకొట్టింది కోరమాండల్. ఈ ప్రమాదం ధాటికి ఓవర్ హెడ్ లోటెన్షన్ లైన్ కరెంట్ తీగలు తెగి బోగీలపై పడటంతో దాదాపు 40మంది కరెంట్ షాక్ తో మృతి చెందినట్టు భావిస్తున్నట్టు ఓ పోలీస్ అధికారి వెల్లడించారు. మరోవైపు ఇంతటి ఘోర దుర్ఘటన వెనుకు కుట్ర కోణం ఉందనే ఆరోపణలతో నిగ్గు తేల్చేందుకు సీబీఐ రంగంలోకి దిగింది.