హైద్రాబాద్ వదిలి ఎందుకు రావడంలేదు చంద్రబాబు, పవన్ కళ్యాణ్.? అని ప్రశ్నిస్తున్నారు వైసీపీ నేతలు. మరి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఢిల్లీకి వెళ్ళడానికి తప్ప.. తాడేపల్లి ప్యాలెస్ దాటి.. జనంలోకి ఎందుకు వెళ్ళడంలేదు.? అంటే, ‘కామన్ సెన్స్ లేదా.?’ అని ఎదురు ప్రశ్నిస్తారు.
కరోనా నేపథ్యంలో రాజకీయ నాయకులు రోడ్లెక్కడం, జనం ఎక్కువగా సమీకరింపబడటానికి ఎందుకు కారణమవడం.? అన్నది వేరే చర్చ. అసలంటూ రాజకీయ నాయకులకు బాధ్యత వుండి వుంటే, కరోనా ఇంతలా ప్రబలి వుండేదా.? మరీ ముఖ్యంగా అధికారంలో వున్నవాళ్ళు అత్యంత బాధ్యతారాహిత్యంతో వ్యవహరించడం వల్లే ఈ దుస్థితి.
ఆంధ్రపదేశ్ రాష్ట్రంలో కరోనా విలయానికి ప్రత్యక్షంగానో, పరోక్షంగానే అధికార పార్టీ నేతలే కారణమన్న విమర్శలున్నాయి. సరే, ఆ సంగతి పక్కన పెడదాం.. మొదటి వేవ్ వచ్చింది.. వెళ్ళింది.. రెండో వేవ్ వచ్చింది.. వెళుతూ వుంది. మరి, మూడో వేవ్ మాటేమిటి.?
ప్రభుత్వాలకి మూడో వేవ్ విషయంలో ముందస్తు బాధ్యత ఎలా వుంది.? మూడో వేవ్ పట్ల అప్రమత్తంగా వుండాలని ప్రభుత్వ పెద్దలు అధికారుల్ని ఆదేశించడం వరకూ బాగానే వుంది. కానీ, గత వైఫల్యాల నుంచి ఏం పాఠాలు నేర్చుకున్నట్టు.? అతి త్వరలో పరీక్షలట.. వాటికి విద్యార్థులు మానసికంగా సిద్ధంగా వున్నారా.? లేదా.? అన్నది పాలకులకు అనవసరం.
రాష్ట్రాలు కోలుకోవాలన్నా, దేశం కోలుకోవాలన్నా కమర్షియల్ యాక్టివిటీస్ పెరగాలి. రాజకీయ పరమైన కార్యక్రమాల్లో నాయకులు సంయమనం పాటించాలి. జనం గుమికూడే అవకాశం వున్న కార్యక్రమాల్ని అదుపులో పెట్టాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీదనే వుంది. ఇంకోపక్క, వ్యాక్సినేషన్ ప్రక్రియలో వేగం పెరగాల్సి వున్నా, అది తాబేలు నడకను తలపిస్తోంది తప్ప.. వేగం పుంజుకోవడంలేదు.
మూడో వేవ్ భయాల నడుమ, ఇంకో ఆర్నెళ్ళపాటు ప్రత్యక్ష విద్యాబోధనకు అవకాశమివ్వకూడదు. అన్నిటికీ మించి అవసరమైన మందుల్ని ముందస్తుగానే సమకూర్చుకోవాలి. ఆక్సిజన్ సరఫరా వ్యవస్థ విషయమై గతంలో జరిగిన పొరపాట్లు మూడో వేవ్ సందర్భంగా జరగకూడదు. వీటికి తోడుగా ‘బ్లాక్ మార్కెట్’లోకి అత్యవసర మందులు వెళ్ళకుండా చూడాలి.
మొదటి వేవ్ నుంచి పాఠాలు నేర్చుకోలేదు పాలకులు. ఫలితం ప్రజలు ప్రాణాలు కోల్పోయారు పెద్ద సంఖ్యలో. మరి, రెండో వేవ్ తర్వాత అయినా పాలకులు కళ్ళు తెరుస్తారా.? తెరవాలనే కోరుకుందాం.