తెలంగాణ ప్రభుత్వం వెల్లడిస్తున్న కోరోనా కేసులు, మరణాలకు.. వాస్తవ పరిస్థితులకు పొంతనలేదా? జీహెచ్ఎంసీ జారీ చేస్తోన్న డెత్ సర్టిఫికెట్లు ఇదే నిరిపిస్తున్నాయా? అంటే అవుననే సమాధానం వస్తోంది. రైట్ టూ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా ఓ స్వచ్చంద సంస్థ సేకరించిన వివరాల ప్రకారం ఏడాదిగా ఒక్క హైదరాబాద్ లోనే 32వేల మందికి పైగా చనిపోయారని తెలుస్తోంది. ఏప్రిల్ 2020 నుంచి మే 2021 వరకు హైదరాబాద్లో 32,752 డెత్ సర్టిఫికెట్లు జారీ అయ్యాయని ఆర్టీఐ లెక్కలు చెప్తున్నాయి.
2020 ఏప్రిల్ నుంచి డిసెంబర్ మధ్య 18,420 మరణాలు సంభవిస్తే.. 2021 జనవరి నుంచి మే వరకు మరణాల సంఖ్య 14,332గా ఉంది. ఈ మరణాలన్నీ కొవిడ్ మరణాలనే విషయం స్పష్టంగా అర్థమవుతోందని వారు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే.. ఏడాదిగా కొవిడ్తో చనిపోయిన వారి సంఖ్య 3257 మాత్రమేనని వైద్యారోగ్యశాఖ నివేదికలు చెప్తున్నాయి. మరి మిగిలిన 30వేల మరణాలు ఎలా సంభవించాయనేది వైద్యారోగ్య శాఖే చెప్పాల్సి ఉంది.