ఇండియన్ సినిమా 100 ఏళ్లు పూర్తి చేసుకున్నా అద్బుతమైన క్లాసిక్ చిత్రాలు వంద వరకు ఉంటాయి. అందులో కొన్ని తెలుగు సినిమాలు కూడా ఉంటాయి. అందులో జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రం ఖచ్చితంగా ఉంటుంది అనడంలో అతి శయోక్తి లేదు. సినిమాను అప్పటి వరకు ప్రేక్షకులు చూస్తున్న తీరును మార్చేసిన చిత్రంగా దీన్ని చెప్పుకోవచ్చు. తెలుగు సినిమా చరిత్రలో ఎప్పటికి నిలిచి పోయే ఈ చిత్రం చిరంజీవి హీరోగా శ్రీదేవి హీరోయిన్గా రూపొందింది. దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు దర్శకత్వంలో అశ్వినీదత్ నిర్మాణంలో రూపొందిన ఈ చిత్రం ఇప్పటికి ఒక అద్బుతమైన ఫాంటసీ చిత్రంగా నిలిచిపోయింది.
ఎన్టీఆర్ నటించిన జగదేక వీరుడి కథ లాంటి ఒక మంచి సినిమా తీయడమే తన లక్ష్యంగా పెట్టుకున్న నిర్మాత అశ్వినీదత్ ఆ సినిమాను రాఘవేంద్ర రావు దర్శకత్వంలో చేయానుకున్నాడు. ఒకసారి తిరుపతిలో ఉన్న సమయంలో వైజయంతి మూవీస్కు చెందిన కో డైరెక్టర్ శ్రీనివాస చక్రవర్తి దేవకన్య భూలోకంకు వచ్చి ఉంగరం పోగొట్టుకోవడం, అది ఒక సామాన్యుడికి దొరుకుతుంది అనే లైన్ చెప్పాడట. ఆ లైన్ రాఘవేంద్ర రావుకు చెప్పడంతో వెంటనే కథ తయారి మొదలు పెట్టారు.
ఈ కథను జంధ్యాల, యండమూరి వీరేంధ్రనాధ్, సత్యమూర్తి, విజయేంద్ర ప్రసాద్, క్రేజీ మోహన్ వంటి మహామహులు కలిసి కూర్చుని రెడీ చేశారు. ఇంతటి మహానుభావులు కలిసి కూర్చున్న తర్వాత కథ అద్బుతంగా కాకుండా మరెలా ఉంటుంది. రాఘవేంద్ర రావుకు ఈ గొప్ప రచయితల టీం అద్బుతమైన కథను అందించారు. భారీ బడ్జెట్ అవుతుందని ముందే ఊహించారు. అయినా కూడా అశ్వినీదత్ తన డ్రీమ్ ప్రాజెక్ట్గా తీసుకుని నిర్మించారు.
ఆరున్నర నుండి ఏడు కోట్లల్లో ఈ సినిమాను పూర్తి చేయాలని మొదట అనుకున్నా అది కాస్త 8 కోట్లకు పైచిలుకు అయ్యింది. అప్పట్లో అయిదు కోట్ల బడ్జెట్తో సినిమా అంటేనే చాలా గొప్ప విషయం. 8 కోట్ల బడ్జెట్తో సినిమా అంటే అప్పుడు సినీ ప్రముఖులు పలువురు నోరు వెళ్లబెట్టారు. రెండు మూడు పెద్ద సినిమాలు తీసేయవచ్చు, అంతటి ప్రయోగం అవసరమా అంటూ పెదవి విరిచారట. ఆ విమర్శలు, కామెంట్స్ పట్టించుకోకుండా అనుకున్నది అనుకున్నట్లుగా దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు.
మహామహులను ఈ చిత్రంలో చూపించాడు. ఎన్నో పద ప్రయోగాలు చేయడంతో పాటు అప్పటి వరకు ఏ సౌత్ సినిమాలకు కూడా ఉపయోగించని గ్రాఫిక్స్ టెక్నాలజీ మరియు ఇతరత్ర టెక్నికల్ అంశాలను వినియోగించి ఒక విజువల్ వండర్లా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.
ఈ చిత్రంకు ఇళయరాజా అందించిన సంగీతం ఒక అద్బుతం. ఆయన ఈ సినిమాకు గాను నంది అవార్డును అందుకున్నారు. సినిమాలోని ఆ పాట ఈ పాట అని కాకుండా అన్ని పాటలు కూడా సూపర్ హిట్ అయ్యాయి. ప్రతి పాట కూడా దేనికి అదే అన్నట్లుగా ఉన్నాయి. ముఖ్యంగా అబ్బనీ తీయని దెబ్బ మెలోడీ ట్యూన్తో సాగే మాస్ సాంగ్గా నిలిచింది.
సరికొత్త ట్రెండ్ను సెట్ చేసిన ఈ చిత్రం మెగాస్టార్ చిరంజీవి స్టార్డంను మరింతగా పెంచడం జరిగింది. చిరంజీవి, శ్రీదేవి కలిసి నటించిన మొదటి సినిమా ఇదే. ఈ చిత్రం తర్వాత శ్రీదేవిని అభిమానులు నిజంగా దేవకన్యలు ఇలాగే ఉంటారేమో అనుకున్నారు. అప్పటి నుండి కూడా శ్రీదేవికి అతిలోక సుందరి పేరు పడిపోయింది.
ఈ చిత్రంలో పిల్లలుగా నటించిన శాలిని, శామిలిలు ఆ తర్వాత కాలంలో హీరోయిన్స్గా కూడా నటించారు. అయితే వారు హీరోయిన్స్గా చేసిన సినిమాల కంటే కూడా ఈ చిత్రంతోనే ఎక్కువగా గుర్తింపు దక్కించుకున్నారు అనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఈ చిత్రంలో ఇంద్రజ పాత్ర పోషించిన శ్రీదేవి చిరంజీవిని మానవా అంటూ పిలవడం అందరికి బాగా కనెక్ట్ అయ్యింది. ఈ చిత్రంలో కామెడీ సీన్స్ను జంద్యాల గారు అద్బుతంగా రాశారు.
సినిమాలోని ప్రతి సీన్ను కూడా రాఘవేంద్ర రావు తెరకెక్కించిన తీరు అమోఘం. ఈ చిత్రానికి గాను ఆయన ఫిల్మ్ ఫేర్ అవార్డును సొంతం చేసుకున్నారు.
8 కోట్ల రూపాయలతో రూపొందిన ఈ చిత్రం అప్పట్లో 13 కోట్లకు మించి వసూళ్లు సాధించింది. ఈ అద్బుత చిత్రం విడుదలై నేటికి 30 ఏళ్లు అయ్యింది.
తాజాగా నిర్మాత అశ్వినీదత్ ఈ సినిమాకు సీక్వెల్ చేస్తానంటూ ప్రకటించడంతో అప్పుడే ఆ సీక్వెల్ గురించిన చర్చ తెలుగు సినిమా ఇండస్ట్రీలో మరియు తెలుగు రాష్ట్రాల్లో జోరుగా చర్చ జరుగుతోంది.
378845 674772I come across your webpage from cuil and its high quality. Thnkx for giving this sort of an incredible write-up.. 328200