₹75 Coin: కొత్త పార్లమెంట్ (New Parliament) ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ (PM Narendra Modi) ఆవిష్కరించిన రూ.75 నాణెం ఆకట్టుకుంటోంది. అయితే.. దీనిని రోజువారీ లావాదేవీలకు వినియోగించలేరు. కారణం.. ఇది స్మారక నాణెం. పలు ప్రత్యేక సందర్భాల్లో స్మారక నాణెలను కేంద్రం విడుదల చేస్తుంది. 1964లో తొలి ప్రధాని నెహ్రూ మరణానంతరం తొలి స్మారక నాణెం విడుదల తర్వాత ఇప్పటికి 150 వరకూ నాణెలు వచ్చాయి. రూ.75 నాణెం (₹75 Coin) కూడా ఇదే కోవలోకి వస్తుంది.
2011 కాయినేజ్ చట్టం ప్రకారం స్మారక నాణేలు ముద్రించే అవకాశం కేంద్ర ప్రభుత్వానికి ఉంది. ప్రస్తుత రూ.75 నాణేన్ని ప్రభుత్వ మింట్ వెబ్ సైట్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా పొందొచ్చు. అయితే.. దీని ధర రూ.75 ఉండదు. 33 మిల్లీమీటర్ల వ్యాసం, 35 గ్రాముల బరువుతో 50శాతం వెండి, 40శాతం రాగి, 5శాతం నికెల్, 5శాతం జింక్ కలిపి నాణేన్ని తయారు చేయడంతో ఖర్చే రూ.1300 వరకూ ఉండొచ్చని అంచనా. దీనిని కొనుక్కుని అపురూపంగా దాచిపెట్టుకోవాలే కానీ మార్కెట్లో లావాదేవీలకు పనికిరాదు.